గురు పౌర్ణమి వివరణ, విశిష్టత మరియు 2022 వేడుకలు! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Tuesday, July 5, 2022

గురు పౌర్ణమి వివరణ, విశిష్టత మరియు 2022 వేడుకలు!

గురు పౌర్ణమి వివరణ మరియు విశిష్టత!
Significance of Guru Purnima
 Image Source  https://vedicfeed.com/

గురు పౌర్ణమి అంటే (Guru panchami in telugu)  :

“గురుపౌర్ణమి” అంటే గురువులకు సంబంధించిన పండగని అర్ధమవుతున్నది. గురువులను ఆరాధించడం మన హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ గురు పౌర్ణమి మన హిందువులలోనే కాకుండా బౌద్ధులలోను, జైనులలో కూడా పండగ దినమే. పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక  మార్గాలను చూపే గురువులనే కాకూండా, జ్ఞాన బోధకుపకరించే చదువులను చెప్పే గురువులను కూడా మన హిందువులు పూజిస్తూ మన ఆచారాలను అనాదిగా గౌరవిస్తూనే ఉన్నారు. 


 “గు” అంటే చీకటి లేదా అంధకారం అని “రు” అంటే పారద్రోలేవాడని అర్ధం. “గురు” వంటే అజ్ఞానం పారద్రోలే వ్యక్తి అని అర్ధం. గురువుని మనకు మరియు భగవంతునకు అనుసంధాన కర్తగా భావించవచ్చు. అంతే కాకుండా గురువుని భగవంతునిగా కూడా ఆరాధించవచ్చు. 


“గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్త్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేన్నమః” 


పై పద్యంలో వివరించినట్టుగా హిందూ మతంలో గురువుని దైవసమానంగా కొలుస్తారు. 


గురు పౌర్ణమి జరుపుకొనే తేదీ (Guru purnami date 2022) :

హిందువులలో  గురువులను శిఖరసమానంగా భావించి పూజించే పండగ “గురు పౌర్ణమి”. అలాంటి గురువులను ఆరాధించే పండగ కోసం ఒక పవిత్రమైన దినంగా  ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి నాడు “గురు పౌర్ణమి”ని జరుపుకుంటాయారు. హిందువులు, బౌద్ధులు మరియు జైనులు తమ గురువులు తమకు అందించిన జ్ఞానానికి కృతజ్ఞతగా ఎంతో విశేషముగా భక్తి, శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ 2022లో జులై నెల 13వ తారీఖున జరుపు కోనున్నారు.


గురు పౌర్ణమి విశిష్టత (Significance of GuruPurnami in telugu) :

నేటి యుగంలోనైనా మానవుడు శరీరంతోనే పుడతాడు కానీ బుద్ధి, జ్ఞానం తో కాదు.  అలాంటి మనిషికి తొలిగురువు తల్లే అనడం సబబు. తల్లే తన బిడ్డకి ఏది మంచో ఏది చెడో చెబుతుంది. తల్లి తరువాత గురువే విద్య బుద్ధుల్ని నేర్పింది. రాయి లాంటి శిష్యుడిని శిల్పంలా మరల్చే గురువుని స్మరించుకొని తమ గురుభక్తిని చాటుకోవడానికి ఒకరోజు కేటాయించడం సమంజసమే కదా!. ఆరోజే గురు పౌర్ణమి. అనాదిగా  కొన్ని వేల సంవత్సరాలుగా గురువులు పూజింపబడుతున్న రోజు “గురు పౌర్ణమి”. 


గురు పౌర్ణమి కధలు (The Story of Guru Purnami in Telugu) : 

అంతర్జాలంలో అందుబాటులోఉన్నకధనాల ప్రకారం గురు పౌర్ణమికి రెండు రకాల కథనాలు అందుబాటులో ఉన్నవి. ఒకటి వ్యాసునిగురించి అయితే రెండవది ఆదియోగి (AdiYogi) సప్తఋషులకు జ్ఞానబోధ చేయుట గురించి.


వ్యాస పౌర్ణమి లేదా వ్యాస జయంతి  :

ఇదే రోజు వ్యాస మహర్షి జన్మ తిధి కావటం అలానే మానవాళికి వేదాలను అందించి జ్ఞానాన్ని అందించినందున వ్యాస మహాముని వేదవ్యాసునిగా పిలువబడి మానవాళికి తొలిగురువు స్థానాన్ని పొందాడు. అప్ప‌టి వ‌ర‌కూ మౌఖికంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సాగిన వేద‌జ్ఞానాన్ని అంత‌టినీ ఒక్క‌చోట‌కు చేర్చి నాలుగు విభాగాలుగా విభ‌జించి గ్రంధస్తం చేసి వేద వాగ్మ‌యాల‌ను సామాన్యుడి చెంత‌కు చేరేలా చేయ‌డంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచ‌మ వేదంగా పేరు తెచ్చుకున్న మ‌హా భారతాన్ని మ‌న‌కు అందించిన వ్యాస భ‌గ‌వానుడు జ‌న్మించిన రోజు కాబ‌ట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస‌పూర్ణిమగా పాటిస్తున్నారు. అందుకే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే జన్మించిన వేదం వ్యాసున్ని స్మరించుకోవటానికే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా వ్యాస జయంతిగా కూడా పండగ చేసుకుంటారు. 


వేదాల‌ను గ్రంద‌స్థం చేసిన వ్యాస మ‌హ‌ర్షి : 

గురు సంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి వెలువడిన నాదం(శబ్దం) నుంచే వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు, బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు.. 


ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది. కానీ అప్పటివరకు గ్రంధస్తం కాని వేదాన్ని గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యులయొక్క జీవనప్రమాణాన్ని, బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించిన వ్యాసమహర్షి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. 


ఆదియోగి :

హిమాలయాల ఎగువ ప్రాంతాలలో 15000 సంవత్సరాల క్రితం ఒక యోగి కనిపించాడు. ఆదియోగి వఛ్చి కూర్చున్నారు తప్ప అయన ప్రాణంతో ఉన్నట్లు కేవలం అయన కళ్ళల్లోంచి స్రవిస్తున్న పారవశ్యపు కన్నీటి ధారలు మినహా కనీసం ఊపిరి పీల్చుకున్న ఆనవాళ్ళు లేవు. అయినప్పటికీ అయన రాకతో గుమిగూడిన ప్రజలు అయన అనుభవిస్తున్న అర్ధం కాని  అనుభూతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఎంత సమయం చూసినా ఆదియోగి వారిని పట్టించుకోకపోవటంతో వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు.


కేవలం ఏడుగురు వ్యక్తులు మాత్రమే మిగిలారు. వారు ఎట్టి పరిస్థితులలోను ఆదియోగి నుంచి నేర్చుకొని తీరాలని కృత నిశ్చయంతో వేచియున్నారు .అయినప్పటికీ ఆదియోగి వారినెవరిని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారు మీ దగ్గరున్న జ్ఞానాన్ని మాకు ఉపదేశించమని” ప్రార్ధించారు.  అంతట ఆదియోగి “మూర్ఖులారా, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికే మీకు కొన్ని యుగాలైనా మీరు తెలుసుకోలేరు. మిమ్మల్ని సిద్ధం చేయాలి. దీని కోసం విపరీతమైన సాధన అవసరం. ఇది ఎంతో కఠినతరమైనది.”


కానీ ఏడుగురు ఔత్సాహికులు చాలా పట్టుబట్టారు కాబట్టి, ఆదియోగి వారికి కొన్ని సన్నాహక దశలను సాధన కోసం ఇచ్చాడు. వారి  సాధన రోజు రోజుకు, వారానికి వారానికి, నెలకు నెలకు, సంవత్సరానికి సంవత్సరానికి - కఠోరంగా కొనసాగుతూనే ఉంది. ఆలా 84 సంవత్సరాల సాధన చేసారని చరిత్ర. అప్పుడు, ఒక పౌర్ణమి రోజు, 84 సంవత్సరాల తరువాత, సూర్యుడు ఉత్తర ప్రయాణం నుండి దక్షిణంకు పరుగుతున్న రోజున (ఈ ప్రక్రియను దక్షిణాయణం అని పిలుస్తారు)  ఆదియోగి ఈ ఏడుగురు వ్యక్తుల వైపు చూశాడు. 


వారిలో తెలుసుకోవాలన్న జిజ్ఞాస వలన కలిగిన కాంతిని ఆదియోగి గమనించి వారు జ్ఞాన సముపార్జన కోసం సిద్ధమయ్యారని గ్రహించి వారికొరకై పౌర్ణమిరోజున గురువుగా మారాలని నిర్ణయించుకుంటారు. ఆ పౌర్ణమి రోజును గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ అంటే మొదటి యోగి తనను తాను ఆది గురువుగా మార్చుకున్న పౌర్ణమి రోజు. అందుచే ఆదియోగిని మొదటిగురువుగా భావిస్తారు. తరువాత ఆ ఏడుగురు శిష్యులు సప్తఋషులుగా పేర్గాంచారు. 


మొదటి గురువైన ఆదియోగి దక్షిణం వైపు తిరిగాడు కాబట్టే ఆయనను దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు.  వెంటనే ఆదియోగి ఏడుగురు శిష్యులకు యోగ శాస్త్రాల జ్ఞానబోధ ప్రారంభించారు.


అందుచే దక్షిణాయనాన వచ్ఛే మొదటి పౌర్ణమి “గురు పౌర్ణమి”గా జరుపుకుంటారు.


గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnami Celebrations) :

గురు పూర్ణిమను దేశవ్యాప్తంగా  సంబరంగా జరుపుకుంటారు. ఈ పండగను  హిందూ మతస్తులే కాకుండా బౌద్ధమతస్తులు  మరియు జైన మతస్తులు కూడా ఆచరిస్తారు. శిష్యులు తమ గురువులను జ్ఞాపకార్థం చేసే కార్యకలాపాలతో ఈ రోజు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ ఇళ్లలో లేదా ఆలయంలో తమ గురువుల పేరిట గురు పూజలు నిర్వహిస్తారు.


ఈ  గురు పూజా మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు తమ గురువులను ఎంతో అభిమానంతో, భక్తితో పూజిస్తారు. అంతే కాకుండా తమ శక్తి కొలది బహుమానాలు సమర్పించి తమ గురువుల ఆశీశ్శులను పొందుతారు. 


ముఖ్యముగా దేశవ్యాప్తంగా షిర్డీ సాయి దేవాలయాల్లో “గురు పౌర్ణమి” వేడుకలు మిన్నంటుతాయి. షిర్డీ దేవస్థానంలో “గురు పౌర్ణమి” వేడుకలు 2022 జులై 12న ప్రారంభమై 2022 జులై 14వరకు కొనసాగనున్నాయి.

No comments:

Post a Comment