సింహాచలం దివ్యక్షేత్రం! సింహాద్రి అప్పన్న చందనోత్సవం!! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Tuesday, April 17, 2018

సింహాచలం దివ్యక్షేత్రం! సింహాద్రి అప్పన్న చందనోత్సవం!!

SRI VARAHANRUSIMHA SWAMY
శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి.
 సింహాచలం దివ్యక్షేత్రం :: సింహాద్రి అప్పన్న చందనోత్సవం

స్థలపురాణం :

ఈ సింహాచలం దివ్యక్షేత్రం స్థలపురాణం లోతుల్లోకి వెళితే లోకాలను భయకంపితుల్ని చేసిన రాక్షరాజులు, సోదరులైన హిరణ్య కశిప, హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది.

హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించుకొని హింసని ప్రజ్వలిమ్పచేసినపుడు ఆ మహావిష్ణువు వామనావతారధారిగా అవతరించి హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని రక్షించాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేని హిరణ్యకశిపుడు మహావిషునువుపై కక్ష సాధనకై బ్రహ్మ మెప్పు కొరకై కఠోర తపస్సు చేయసాగాడు.

ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుని కోరిక సాధ్యపడదని సెలవిచ్చాడు. హిరణ్యకశిపుడు తేరుకొని తనకు జంతువుతో గాని మనిషితో గాని, పగలు కానీ రాత్రి కాని, ఆకాశంలో కాని భూమిపై కాని మరణం లేకుండా బ్రహ్మ దేవుణ్ణి వరం కోరి పొందాడు.

హిరణ్యకశిపుడు తనకు చావే లేదని గర్వితుడై, భూమండల వాసులంతా తననే పూజించాలని వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా దేవతలను, మునులను, విష్ణు భక్తులను వేధించసాగాడు.

విధి వైచిత్రి, హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తునిగా జన్మించాడు. “నారాయణ” నామ జపంతో అనునిత్యం విష్ణు ఆరాధనలో ఉండటం హిరణ్యకసిపునికి ఆగ్రహం తెప్పించి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుని విష్ణుభక్తిని కించిత్తు మార్చలేకపోతాడు.

హిరణ్యకశిపుడు అసహనానికి గురై మదగజాలతో తొక్కించినా, విషసర్పాలతో మధ్యలో పడేసినా ప్రహ్లాదుడు లొంగలేదు. సరి కదా నారాయణ నామ స్మరణతో అడ్డంకుల్ని ప్రహ్లాదుడు అధిరోహించడం హిరణ్యకసుపుని అగ్రహజ్వాలల్ని మరింత రగిలించింది.

చివరిగా ప్రహ్లాదుడిని సముద్రంలో తోసి అతనిపై ఓ పర్వతాన్నుంచమని తన భటులను అజ్ఞాపించాడు. భటులు ప్రహ్లాదుడిని సింహాద్రి పర్వతం పైకి ఎక్కిస్తారు. అక్కడినుండి సముద్రంలోకి ప్రహ్లాడుడిని విసిరి వేసి ఆపై సింహాద్రి పరవతాన్ని పెకిలించి అతనిపై ఉంచాలని వారి ఆలోచన. అంతలో మహావిష్ణువు సింహాద్రి కొండపైకి ఉరికి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడారు.

అందుచే సింహాద్రి పర్వతం ప్రహ్లాదుడిని మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
తన భక్తుడైన ప్రహ్లాదుని కోరికమేరకు మహావిష్ణువు, హిరణ్యకశిపుని సంహరించిన వరాహావతారం మరియు హిరణ్యాక్షుడిని సంహరించిన నృసింహావాతారముల కలబోతగా వరహనృసింహంగా అవతరించి సింహాచలం దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నారు.

simhachalam divyakshetram
సింహాచలం దివ్యక్షేత్రం

సింహాచలం దివ్యక్షేత్రం ఆలయ చరిత్ర :

తన తండ్రి మరణానంతరం ప్రహ్లాడుడే వరహనరసింహ స్వామి ఉత్సవామూర్తికి తొలిగా ఆలయ నిర్మాణం చేపట్టారని, కృతయుగం ఆఖరులో ఆలయం శిధిలావస్తకు చేరుకుందని తెలుస్తోంది.

అయితే తరువాతి కాలంలో రాజ పురురావ తన సతీమణి ఊర్వశితో విహారానికి గుర్రాలపై వెళ్ళగా అతను సింహాచలం దివ్యక్షేత్రం వైపు ఆకర్షింపబడి బురదలో కూరుకుపోయిన వరహనరసింహ స్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా ఆకాశవాణి స్వామి వారి నిజరూపాన్ని బయట చేయరాదని  చందనం పూత పూయాలని సంవత్సరంలో ఒకసారి వైశాఖ మాసం మూడవరోజున మాత్రమే నిజరూప దర్శనం చేయించాలని వినిపించగా రాజ పురురావ స్వామి వారి విగ్రహం పైనుంచి తొలగించిన బురద స్థానంలో చందనం పూత పూయించిన నాటి నుండి నేటి వరకు వరహనరసింహ స్వామి వారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహతంగా భక్తుల నీరాజనాలను అందుకొంటూనే ఉంది. అప్పట్లోనే రాజా పురురవ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థలపురాణం చెపుతోంది. స్వామి వారి నిజరూప దర్శనం ఒక్క అక్షయ తృతీయ నాడే లభిస్తుంది.

ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు నాటి శిలాఫలకాలు ఉన్నవి. అయితే కళింగ రాజ్యాన్ని గెలుపొందిన చోళరాజు కులోత్తుంగ-1 కాలం నాటికే ఈ దివ్యక్షేత్రం ప్రముఖంగా వేలుగొందినట్లు చారిత్రిక ఆధారాలు చెపుతున్నాయి.

శ్రీక్రిష్ణదేవరాలు వారు, తన సతీమణి తో కలసి స్వామి వారికీ 991 ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలను సమర్పించారని శాసనాలు చెపుతున్నవి.

సింహాచలం దివ్యక్షేత్రం విశిష్టతలు :

ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికి ఎన్నో విశిష్టతలను కలగి ఉంది. పెద్ద గోపురం, 16 స్థంబాల ముఖమండపం, వైష్ణవేటి పురాణాల ఆదరంతో హృద్యంగా చెక్కబడిన కళాకృతులు, , భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కప్పస్తంభం, విశాలమైన వరండా వేటికవే ప్రత్యేకతలను సంతరించుకున్నాయ్. ఆలయానికి ఉత్తరాన ఉన్న నాట్యమండపం మరొక ఆకర్షణ. ఈ మండపం 96 స్థంబాలను కలిగి ఉన్నది.

కప్పస్థంభం : 

ఈ స్థంభం అంతరాలయంలో ఉన్నది. ఈ స్తంభం  నిర్మలమైన మనస్సుతో ప్రార్ధించే భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తుందని విశ్వాసం. ఈస్తంభం లోపల సంతనగోపల యంత్రం ప్రతిష్టిమ్పబదిందని అందుచే భక్తులకోరిన కోర్కెలు తీర్చే శక్తి కప్పస్తంబానికి వచ్చిందని నమ్మకం. పిల్లలు లేని జంటలు ఈ స్థంబాన్ని ఆలింగనం చేసుకొనే సంతానం కలుగుతుందని ప్రతీతి.

గంగధార : 

కొండల పైనుంచి ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ వచ్చే ఈ స్వచ్చమైన జలధారా ప్రవాహం వద్ద యాత్రికులు ఎంతో విశేష నమ్మకంతో శిరస్నామాచారిస్తారు. ఇలా చేస్తే వారి రోగాలు పోయి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.

సింహాచలం దివ్యక్షేత్రంలో స్వామి వారికి నిర్వహించే వార్షిక పూజాది కార్యక్రమాలు :

ü  ఉగాది నాడు నిర్వహించే పందిరి రాట ఉత్సవం. ఈ రోజు(చైత్ర శుద్ధ పాఢ్యమి) స్వామి వారిని పెళ్ళికొడుకుగా అలంకరిస్తారు.
ü  వైశాఖ శుక్ల చతుర్ధశి నాడు స్వామి వారి జయంతోత్సవం నిర్వహిస్తారు.
ü  స్వామి వారు వివాహానికి బయలుదేరేముందు రథోత్సవం నిర్వహిస్తారు.
ü  చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

చందనయాత్ర లేదా చందనోత్సవం : 

వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. ఈ నిజ రూప దర్శనం సందర్భంగా భక్తుల తాకిడి తెల్లవారు ఝామునుండే ప్రారంభమవుతుంది. సుమారుగా రోజంతా లక్షకు పైచిలుకు భక్తులు హాజరవుతారని దేవాలయ అధికారులు చెబుతున్నారు. నిత్యం నాలుగు పూతల చందనంతో కనిపించే స్వామి ఈరోజు పరిమిత సమయం నిజరూప దర్శనం తరువాత తొలి చందనపు పూత పూస్తారు. ఈరోజే చందనయాత్ర లేదా చందనోత్సవంగా పిలువబడుతుంది. వైశాఖ పౌర్ణమి : చందన సమర్పణలో రెండవ రోజు. ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యేష్ట పౌర్ణమి : చందన సమర్పణలో మూడవ రోజు. ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఆషాడ పౌర్ణమి : చందన సమర్పణలో చివరి రోజు.

తెప్పోత్సవం : పుష్య బహుళ అమావాస్య నాడు తెప్పోత్సవంగా జరుపుకుంటారు. ఉత్సవమూర్తులను పల్లకీపై వరాహ పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు.  ఊరేగింపుకు భక్తులు వీధులకు ఇరువైపులా చేరి స్వామీ వారిని దర్శించుకోవటం పరిపాటి.

కనుమ : ఈ రోజు స్వామీ వారి ఉత్సవ మూర్తిని కొండ దిగువన గల వనంలోకి తీసుకువస్తారు. అక్కడి నుండి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయానికి తీసుకు వస్తారు. ఇచట ఉన్న దేవస్థానం వారి చెరువు వద్ద గజేంద్ర మోక్షం లోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శన చేస్తారు.

వైకుంఠ ఏకాదశి : ధనశుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

గిరి ప్రదక్షిణ : ఆషాడ పౌర్ణమి నాడు చాలమంది భక్తులు సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఉపవాస దీక్షను పూని సుమారు 34కి.మీ. దూరం ఉండే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వరాహనృసింహ స్వామిని దర్శించుకొని ఆహరం తీసుకొంటారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయలేని వారు ఆలయంలోనే 108 ప్రదక్షిణాలు చేసి ఆధ్యాత్మిక తృప్తి పొందుతారు.

ANNADANAM IN PROGRESS
భక్తుల కోసం అన్నదానం  

అన్నదానం :

1989 నాటి ధర్మకర్త డాక్టర్ శ్రీ.పి.వి.జి.రాజు గారి అధ్వర్యంలో ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం ఈనాటికి రోజుకి 5000 మందికి అన్నదాన సౌకర్యం కలిగించే స్థాయికి ఎదిగింది.

వసతి సౌకర్యం : 

యాత్రికుల సౌకర్యార్ధం కొడపై “యత్రసదన్” కామన్ బాత్రూం, టాయిలెట్స్, వెయిటింగ్ హాల్, లాకర్ సౌకర్యంతో కలదు. అంతే కాకుండా “గజపతి సత్రం”లో 48 గదులు సాధారణ అద్దెకు లబిస్తాయి.
ఇవి కాకుండా కొండ దిగువన 2014లో “యాత్ర పుష్కరిణి” సమీపంలో నిర్మించిన “నర్మదా సదన్” 68 గదులు, టి.టి.డి.చౌల్త్రి 12 గదులు, “పుష్కరిణి చౌల్త్రి”లో 40 గదులు యాత్రికుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్నవి.

ప్రయాణ వివరాలు :

బస్సు సౌకర్యం : 

రాష్ట్రము లోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు సౌకర్యం విరివిగా ఉన్నది. విశాఖపట్నం బస్సు కాంప్లెక్స్ నుండి సింహాచలం కొండ పైకి చేరుకోవటానికి విరివిగా బస్సు సౌకర్యం ఉన్నది.

రైలు సౌకర్యం : 

అన్ని ప్రధాన నగరాల నుండి విశాఖపట్నం జంక్షన్ కు రైలు సౌకర్యం ఉంటుంది. ఇచ్చటి నుండి సింహాచలం కొండ పైకి ప్రతి పది నిముషాలకు సిటి బస్సు సౌకర్యం ఉన్నది.

విమాన సౌకర్యం : 

దేశంలోని అన్ని ప్రధాన నగరాల విమానాశ్రయాల నుండి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్న సంగతి మీకు తెలిసిందే. ఇక్కడి నుండి ప్రైవేటు కాబ్ లలో సింహాచలం కొండపైకి చేరుకోవచ్చును.

No comments:

Post a Comment